Monday, December 8, 2008

తెలుగు భాషాభిమానులం - ఆరంభశూరులం!

"తెలుగు భాషని తెలుగు వాళ్ళే మాట్లాడటం లేదు. అలా మాట్లాడటానికి తెలుగు వాళ్ళే సిగ్గు పడుతున్నారు. మమ్మీ, డాడీ సంస్కృతి వచ్చి తెలుగుని తుడిఛిపెడుతోంది" అంటూ ఎందరో తెలుగు భాషాభిమానులు తెలుగు బ్లాగులలోనూ, తెలుగు గుంపులలోనూ ప్రతి రోజూ ఎన్నో పేజీలను నింపేస్తునారు. వేరే భాషల వాళ్ళు వాళ్ళ భాషలను ఎలా ప్రొత్సహిస్తున్నారో చెప్తున్నారు. ఈ-తెలుగు (etelugu.org) లో "తెలుగుని నిలుపుట" గురించి జరిగిన చర్చలో చాలా చాలా చెప్పేరు. కొంతమంది కొన్ని సుచనలూ చేసేరు. కాని విచిత్రమేమిటంటే, మనం ఈ విషయంలో కార్యాచరణకు పూనుకొనేందుకు ఉద్యుక్తులవుదాం, రండి ఒక చోట కూర్చొని ముఖాముఖి చర్చించి నిర్ణయాలను తీసుకుందాం అంటే ఏదో ఒక సాకుతో ముఖం చాటేస్తారు. ప్రతీ నెలా తప్పకుండా ఈ-తెలుగు (తెలుగు బ్లాగర్ల) సమావేశాలు జరుగుతున్నాయి. కాని పైన ఉదహరించిన పెద్దలు ఎంతమంది ముందుకు వచ్చేరు? సమావేశాలకు వచ్చి చర్చించేరు? తెలుగు భాష పైన అభిమానం ఇంతేనా? ఇలా అంటే కటువుగా అనిపించవచ్చు. కాని ఇది నూటికి నూరు పాళ్ళు నిజం.

ఊరకనే అభిమానం, అభిమానం అంటూ గొంతు చించుకుంటే ఏమి ప్రయోజనం? బ్లాగులలో వ్రాతలతోనూ, ఒకరినొకరు పొగుడుకోవటంతోనూ సరిపెట్టుకుంటే ఎలా? వ్రాయాలా, రాయాలా అన్న చర్చ ప్రస్తుత పరిస్థితులలో ముఖ్యం కాదు. అసలు తెలుగు భాష ఉనికే ప్రశ్నార్ధకం అయినప్పుడు.

వేరే ప్రదేశాలలో ఉన్న వారిని ప్రక్కకు పెడితే హైదరాబాదులోనే ఉంటూ ఈ-తెలుగు (బ్లాగర్ల)సమావేశాలలో ఉత్సాహం చూపినది ఎందరు? మీకందరికీ తెలుసు. ఇది ఏదో ఒకరిద్దరి సమస్య కాదు.కాని బ్లాగులలోనూ, గుంపులలోనూ కబుర్లు చెప్పటంతో సరిపెట్టటం ఎంతవరకూ సమంజసం? పైగా ఉచిత సలహాలతో సరిపెడుతున్నారు.ఆంటే మనది ఆవేశం మాత్రమే అన్నమాట. అదే తెలుగు వాళ్ళకు పుట్టుకతో వచ్చిన బుద్ధా?

నాదొకటే కోరిక. వచ్చే 14వ తేదీన 3 గంటలకు, హైదరాబాదు యూసఫుగూడాలోని కృష్ణకాంత్ పార్కులో జరిగే సమావేశానికి రండి. మీ సూచనలకు కార్యరూపం ఇవ్వండి.వివరాలకు ఇక్కడ చూడండి
పై మాటలు మీకు కోపం తెప్పిస్తే అది నామీద చూపండి. అంతేకాని తెలుగు భాషని బ్రతకనీయండి.అందరం కలిసి భాషని నిలుపుదాం
.

Tuesday, November 25, 2008

నేను సైతం .....

తెలుగుకు ప్రాచీనభాష హోదా వచ్చింది. కాని ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే అసలు తెలుగు భాషే అంతరించి పోయే ప్రమాదం పొంచి ఉందనిపిస్తోంది. ఇది వట్టి ఊహ కాదు. పచ్చి నిజం. ప్రస్తుత తెలుగు కవిపుంగవులకు వారి గొప్పలు వాళ్ళు చెప్ప్పుకోవటనికే సమయం చాలదు. ప్రభుత్వాలకి తమ ఉనికిని కాపాడుకోవటంలో ఉన్న శ్రద్ధ చదువులపైకి పోదు. పోతే, ఇలాంటి పని ఎందుకు చేస్తారు? అదే, పాఠశాలలో తెలుగు మాధ్యమాన్ని తీసేసి ఆంగ్లాన్ని ప్రవేశపెట్టటం. వాళ్ళ ఏడుపేదో వాళ్ళు ఏడిస్తే బాగుంటుంది. ఇలా సిగ్గూ ఎగ్గూ లేకుండా తగుదునమ్మా అని విద్యావిషయాలలో బుర్రపెట్టదానికి వీళ్ళకున్న అర్హత ఏమిటి? బొడ్డు కోస్తే అక్షరం ముక్క లేని అడ్డమైన వాళ్ళు మంత్రులై పోవడం, తగుదునమ్మా అని అన్ని విషయాలలోను వేలు పెట్టడం. తెలుగు భాష ఏమైనా పోనీ, మన పేరు హోరెత్తుతే చాలనుకొనే కవి పుంగవులు ఆ రాజకీయ అవినీతిపరులకు తాళం వెయ్యటం. చేతులూపుకుంటూ చెప్పేశాడు, పెద్దమనిషి మన ముఖ్యమంత్రి పేదలకు కూడా డబ్బున్నవాళ్ళకి మాత్రమే అందుబాటులో ఉన్నకాన్వెంటు విద్య అందిస్తుంది తమ ప్రభుత్వమని. వాళ్ళూ పెద్ద పెద్ద ఉద్యోగాలచెయ్యటానికి ఇది పనికి వస్తుందట. మింగటానికి మెతుకు లేని వాళ్ళకి మీసాలకు సంపెంగ నూనె వ్రాస్తారుట. పట్టణాలలో ప్రతిఒక్కరూ పట్టుబట్టి తెలుగు భాష, సంస్కృతులను మట్టి కలిపేశారు. పోనీ పల్లెటూళ్లలో అక్కడో ఇక్కడో తెలుగుతనం ఉందనుకుంటే అదీ మంట కలిపేయటానికి నడుం కట్టేరు ప్రభువులు.

కర్ణుడు చావుకి ఎన్నో కారణాలు. తెలుగుభాష, సంస్కృతి మాయమవుతుండటానికి అంతకుమించి కారణాలు. నేడు తెలుగువాడు వేరొక తెలుగువాడితొ తెలుగులో మాట్లాడటానికే సిగ్గుపడుతున్నాడంటే, రెండు వాక్యాలు తెలుగులో మాట్లాడితే రెండొందల ఆంగ్ల పదాలను వాడటమే గొప్పనుకునే స్తితికి దిగజారేడంటే ఎక్కడికి పోతోంది మన భాష, మన సంస్కృతి?

"నేను సైతం
నల్లరంగుని
తెల్లజుట్టుకు రాసి దువ్వేను
ఇంత చేసీ
ఇంత క్రితమే
తిరుపతయ్యకు జుట్టు నిచ్చేను"

ఇలానే ఉంది మన భాషా, సంస్కృతుల ప్రస్తుత దుస్తుతి.

తెలుగు ఉనికిని కాపాడాలంటే ఇది మనలాంటి సామాన్యుల వలనే సాధ్యం. మనందరం దీనికి సమాయత్తం కావాలి.
ఏదో ఒక గొడుగు కిందికి అందరూ చేరాలి. సంఘటితంగా కృషి చెయ్యాలి. కార్యాచరణకు నడుం కట్టాలి. ఈ బృహత్కార్యానికి "ఈ-తెలుగు" సంఘం ముందుకొస్తోంది. మన అభిప్రాయాలు నిర్మొహమాటంగా చెప్పి కార్యాచరణకు మన వంతు సహకారం అందిద్దాం.

క్రింది లంకె చూడండి

http://etelugu.org/node/138

ఇక్కడ ఈ విషయమై జరుగుతున్న చర్చలో భాగస్వామ్యులు కండి. తెలుగుని నిలబెట్టండి.